PV Narasimha Rao : పీవీని ఎంత స్మరించుకున్నా తక్కువే : సీఎం కేసీఆర్
పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేసీఆర్.
- kunduru Vinod
- Published On : June 28, 2021 / 01:41 PM IST
Pv Narasimha Rao
PV Narasimha Rao : భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్బంగా ప్రముఖులు హైదరాబాద్ పీవీ మార్గ్లోని (నెక్లెస్ రోడ్) పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గత ఏడాది కాలంగా జరుగుతున్న పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కే.కేశవరావు ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్ బిగాలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు సీఎం కేసీఆర్.
శతజయంతి సందర్బంగా ఆవిష్కరించిన 26 అడుగుల పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయిందని కేసీఆర్ అన్నారు. ఈ రహదారికి పీవీ మార్గ్ అని నామకరణం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్ లో అనేక పథకాలకు పీవీ పేరు పెడతారని కేసీఆర్ తెలిపారు.
