Quthbullapur : నగరాల్లో సొంత ఇల్లు ఉండాలని ఎవరు కోరుకోరు.. కొద్దోగొప్పో డబ్బు ఉంటే.. దానికి బ్యాంకు లోన్ జత చేసి ఓ ఇల్లు కొనేస్తున్నారు. అయితే మార్కెట్లో భూమి రేటు విపరీతంగా పెరగడంతో అక్రమార్కుల దృష్టి అసైన్డ్ భూములు, చెరువులపై పడింది. వీటిని ఆక్రమించి విల్లాలు అపార్టుమెట్లు కట్టేస్తున్నారు. తెలిసీతెలియక అసైన్డ్ భూములు, చెరువులను కబ్జా చేసి నిర్మించిన అపార్టుమెట్లను, విల్లాలను కొని.. తీరా అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత లబోదిబో అంటున్నారు. ఇల్లు కట్టి అమ్మిన అక్రమార్కులు కోట్లకు కోట్లు తీసుకు పోతుంటే.. కొన్నవారు మాత్రం అటు డబ్బు, ఇటు ఇల్లు కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.
చదవండి : Telangana crime : పరువు కోసం..కూతుర్ని చంపేసిన తల్లి
తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ తమ కష్టమర్లను దారుణంగా మోసం చేసినట్లు సమాచారం. ఈ సంస్థ సరైన అనుమతులు లేకుండా 170/3, 170/4, 170/5 సర్వే నంబర్లలో 260 విల్లాలను నిర్మించి కొనుగోలుదారులకు అంటగట్టింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్.. ఎస్ హరీష్ విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్ పీ బోగీశ్వర్లు, టౌన్ ప్లానింగ్ అధికారి సాయిబాబా సిబ్బందితో శనివారం విల్లాలను పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా వెలసిన నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు.
చదవండి : Electricity tariff in Telangana: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు!
చెరువు బఫర్జోన్ స్థలాన్ని, అసైన్డ్ స్థలాన్ని ఆక్రమించి వాటిని నిర్మించడంతో 100 విల్లాలను సీజ్ చేశారు. మిగిలిన 160 విల్లాలకు కూడా అనుమతులు లేనట్టు గుర్తించామని, వాటిని కూడా సీజ్ చేస్తామని తెలిపారు. అయితే ఈ విల్లా రేటు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విల్లాలను సీజ్ చేయడంతో వాటిని కొన్నవారు లబోదిబో అంటున్నారు.