Rains Alert : ముంచుకొస్తున్న తుపాను గండం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. కుండపోత వర్షాలకు చాన్స్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
Rains Alert : అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి శక్తిగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నామకరణం చేసింది.
- Harishth Thanniru
- Published On : October 4, 2025 / 06:58 AM IST
Rains Alert
Rain Alert in AP : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం సాయంత్రం ఒడిశాలో గోపాల్ పూర్ సమీపంలో తీరందాటింది. శుక్రవారం ఉదయానికి ఇది వాయుగుండంగా బలహీనపడింది. శనివారం సాయంత్రం వరకు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఇదే సమయంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు (Rains Alert) బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి శక్తిగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నామకరణం చేసింది. శనివారం నాటికి ఇది తీవ్ర తుపానుగా బలం పుంజుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుపాను గుజరాత్ కు 520 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇవాళ గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్లకు చేరుతుంది. రాత్రికి తిరిగి కాస్త బలహీనపడి గంటకు 110 కిలోమీటర్లకు చేరుతుంది. ప్రస్తుతం ఇది గుజరాత్ కు దూరంగా వెళు్తోంది. ఆదివారం తరువాత ఇది తిరిగి వెనక్కి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే.. ఇవాళ ఏపీలోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉప్పొంగి ప్రవహిస్తున్న వంశధార, నాగావళి..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటంతో ప్లాష్ ప్లడ్ ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వంశధార ,నాగావళి నదులకు వరదనీరు భారీగా చేరుతోంది. గోట్టా బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గింది. 74వేల క్యూసెక్కులకు వరద ఇన్ ఫ్లో తగ్గింది. ఒరిస్సాలో వర్షాలకు రెండు నదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది.
వంశధార వరద ఉధృతి దృష్టా లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. తుంగతంపర, పాతూరు, లక్ష్మీపురం, గొట్ట, జిల్లేడుపేట గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు సూచించారు. పలుచోట్ల వంశధార నదికి గట్టు బలహీనంగా మారడం, కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు తెగిపోయ్యాయి. కొండచరియలు విరిగి పడడంతో ఏఓబీతో అనేక ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతంలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. వంశధార పరివాహక ప్రాంతంలో వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది.
