Rajiv Yuva Vikasam: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- Harishth Thanniru
- Published On : April 11, 2025 / 09:59 AM IST
CM Revanth Reddy
Rajiv Yuva Vikasam: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల యువత సొంతంగా ఉపాధి పొందేందుకు ఆర్థిక సహాయం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువతకు వారు కోరుకున్న రంగాల్లో ఉపాధి పొందేందుకు రాయితీతో కూడిన రుణాలను గరిష్టంగా రూ.4లక్షల వరకు అందించనుంది. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్లతో దాదాపు 5లక్షల మంది నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్ లో నిధులనుసైతం కేటాయించింది. 21 నుంచి 60ఏళ్లలోపు వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.2లక్షల లోపు ఉండాలి.
రాజీవ్ యువ వికాసం పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం లబ్ధిదారులు వ్యవసాయ యంత్ర పరికరాలు పొందేందుకు రుణసాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత రుణసాయానికి అనువైన యంత్ర పరికరాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని వ్యవసాయశాఖను ఆదేశించింది. దీనికి అనుగుణంగా అధికారులు ప్రభుత్వానికి జాబితా పంపించారు.
డ్రోన్లు, చిన్న ట్రాక్టర్లు, రొటోవేటర్లు, ప్యాడిబేలర్లు, కాటన్ ష్రెడ్డర్లు, బూమ్ స్ప్రేయర్, సీడ్-ఫెర్టిలైజర్ డ్రిల్, బండ్ ఫోర్మర్, డిస్క్ హారో, పవర్ వీడర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ర్పేయర్, ఆటో ఆపరేటెడ్ నాగళ్లు, మల్చింగ్ మెషిన్లు తదితరాలు పంపిణీకి అనువుగా ఉంటాయని వ్యవసాయశాఖ నివేదిక అందించింది. వ్యవసాయ రంగానికి యంత్ర పరికరాల అవసరం, డిమాండ్ దృష్ట్యా వాటిని రాజీవ్ యువవికాసంలో చేర్చడం జరిగిందని బీసీ కార్పొరేన్ ఎండీ మల్లయ్య బట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే యువత ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది సాగు సమయంలో ఉపయోగించే యంత్ర పరికరాలకోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
