తనను అవమానించానని డీకే అరుణ అంటున్నారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy: శత్రువు చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను..
- T Venkateshwarlu
- Published On : April 23, 2024 / 05:48 PM IST
Cm Revanth Reddy
తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు కథానాయకులై తనను 33 వేల మెజారిటీతో గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అప్పట్లో డీకే అరుణ అడ్డుకున్నారని చెప్పారు.
ఇప్పుడు ఆమె ఓట్లు అడగడానికి వస్తున్నారని తెలిపారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని చెప్పారు. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించానని తెలిపారు. మోదీ చేతిలో కత్తిలా మారి పాలమూరు కడుపులో పొడవద్దని చెప్పారు. పాలమూరు ప్రజలు తనకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు, ప్రత్యర్థులు లేరని చెప్పారు.
కొడంగల్ ను దొంగ దెబ్బ తీయాలని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలపై ఉందని తెలిపారు. 70 ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తనకు అండగా నిలబడాలని కోరారు. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలిపారు. సేవాలాల్ సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీశ్ మాట్లాడుతున్నారని తెలిపారు.హరీశ్ రావు ఆయన పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాలు విసిరారు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వాలని అన్నారు.
Also Read: బీఆర్ఎస్ గురించి కుండబద్దలు కొట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు: మంత్రి కోమటిరెడ్డి
