వాల్మీకి, బోయల పట్ల కాంగ్రెస్కు ప్రత్యేక అభిమానం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాల్మీకి, బోయలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, అది ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తామని తెలిపారు.
అందరూ ఒకవైపు రావాలని, ఇప్పుడు మన ప్రభుత్వం ఉందని అన్నారు. ఢిల్లీలోనూ తెలంగాణ సర్కారు పరిపాలనను అభినందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్య, భర్తల మాటలు విన్నదని ఆరోపించారు.
వింటే ఏమైతదని కేటీఆర్ అంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారులకు తానే ఆ రోజే చెప్పానని, వారు వినలేదని అన్నారు. ఇప్పుడు జైలుకు వెళ్తున్నారని తెలిపారు. తనను దెబ్బ తీయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేయాలని భావిస్తున్నాయని చెప్పారు.
ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందని రేవంత్ రెడ్డి నిలదీశారు. బోయలకు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి సమస్యల పరిష్కారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
Also Read: ప్రణీత్రావు కేసులో మరో సంచలనం.. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు