×
Ad

High Court : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌..జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో ప్రమాణస్వీకారం చేయించారు.

  • Published On : October 11, 2021 / 12:58 PM IST

High Court (1)

Satish Chandra Sharma sworn in : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ.. ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం(అక్టోబర్ 11,2021) గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌… జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తోపాటు పలువురు హాజరయ్యారు.

గత నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పించింది. ఐదుగురు సీజేలను బదిలీ చేయాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ నియమితులయ్యారు.

KRMB Projects : కృష్ణా బోర్డు పరిధిలోకి 29 ప్రాజెక్టులు..అంగీకారం తెలిపిన ఏపీ, తెలంగాణ

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 1961 నవంబరు 30న జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ జన్మించారు. డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. అందులోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్‌ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. అనేక విభాగాల్లో కేసులను వాదించి ఉత్తమ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు.

42 ఏళ్ల వయసులోనే సీనియర్‌ న్యాయవాదిగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు నుంచి గుర్తింపు వచ్చింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అతిపిన్న వయస్కుడైన సీనియర్‌ న్యాయవాదిగా పేరు పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరిలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Viral letter : ఇంట్లో డబ్బుల్లేకపోతే తాళం ఎందుకేశారు? కలెక్టర్ ఇంట్లో చోరీ చేసిన దొంగల లేఖ

ఆగస్టు 31 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 అక్టోబర్ 11 నుంచి తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. మొన్నటి వరకు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.