రైతులు బీఆర్ఎస్ నేతల ఉచ్చులో పడొద్దు.. హామీలు పక్కగా అమలు చేస్తాం: సత్యం శ్రీరంగం
బీఆర్ఎస్ పార్టీని మూసివేసేందుకు ఒప్పందం జరిగింది. మా సీఎం చెప్పినట్లు బీఆర్ఎస్ పెద్దలకు కేంద్రంలో పదవులు రాబోతున్నాయి.
- Naga Srinivasa Rao Poduri
- Published On : August 23, 2024 / 02:05 PM IST
Satyam Srirangam slams BRS leaders over crop loan waiver
Satyam Srirangam: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం పంటల రుణమాఫీ చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులు బీఆర్ఎస్ నేతల ఉచ్చులో పడొద్దని సూచించారు. రుణమాఫీ కాని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వ్యవసాయ రుణాల మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు.
”సీఎం రేవంత్ రెడ్డి రైతులను, దేవుళ్ళను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పదేళ్లలో మీరు చేసిన రుణమాఫీ రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని రుణమాఫీ చేశాం. 2 లక్షల రుణం ఉన్న రైతులకు కూడా పైన ఉన్న బకాయిలు కడితే రుణమాఫీ అవుతుంది. కొంతమందికి వివిధ కారణాల వల్ల రుణమాఫీ కాలేదు.. అందుకు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేయండి రుణమాఫీ చేస్తాని ప్రభుత్వం చెబుతోంది. రైతులను రోడ్ల మీదకు తెచ్చి రెచ్చగొడితే రైతులకు లాభం జరుగుతుందా?
Also Read : వరంగల్ కాంగ్రెస్లో భగ్గుమన్న విబేధాలు.. ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ తెలంగాణ ఉద్యమం మాదిరి ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తాం అంటున్నారు. ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చుకున్న నాడే.. తెలంగాణ పదం పలికే అర్హత కోల్పోయారు. పార్టీ మూసివేసేందుకు ఒప్పందం జరిగింది. మా సీఎం చెప్పినట్లు బీఆర్ఎస్ పెద్దలకు కేంద్రంలో పదవులు రాబోతున్నాయి. గత పాలకులు రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేశారు. కాళేశ్వరం అవినీతికి ఆద్యులు కేసీఆర్, హరీష్ రావు అని ఇవాళ వార్తలు వస్తున్నాయి. మేం ఇచ్చిన హామీలు పక్కగా అమలు చేస్తామ”ని సత్యం శ్రీరంగం అన్నారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ సత్యం శ్రీరంగం ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/enpbRTCFmr
— Telangana Congress (@INCTelangana) August 23, 2024
