Secunderabad Railway Station Loss : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లు, విధ్వంసకాండ కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ అల్లర్ల కారణంగా రూ.7 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది. నిరసనకారులు నాలుగు బోగీలను తగులబెట్టారని అధికారులు వెల్లడించారు. ఈ అల్లర్లలో 30కి పైగా బోగీల అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. భారీ విధ్వంసాన్ని ఆపేందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వేశాఖ చెప్పింది.
ఆందోళన గురించి నిఘా వర్గాల నుంచి ఎలాంటి సమాచారం తమకు అందలేదని రైల్వే శాఖ చెప్పింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. భారీ విధ్వంసాన్ని ఆపేందుకే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. నిరసనకారుల దాడుల సమయంలో స్టేషన్ లో 2వేల లీటర్ల డీజిల్ తో ఉన్న ఇంజిన్ ఉందని, దానికి కనుక నిప్పు పెట్టి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని, చాలామంది ప్రాణాలు పోయి ఉండేవని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. ఈ పరిస్థితి రాకుండా తప్పించేందుకే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వేశాఖ అధికారులు వివరించారు.(Secunderabad Railway Station)
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
9 గంటల హై టెన్షన్ కు ఎండ్ కార్డ్ పడింది. పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆల్ క్లియర్. వందల మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్టేషన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు.. ఆందోళనకారులందరినీ అరెస్ట్ చేశారు. లాఠీచార్జి చేయకుండానే, ఒక్కరిపైన ఒక్క దెబ్బ కూడా వేయకుండానే నిరసనకారులను అరెస్ట్ చేసి బయటకు తరలించారు.
Bharat Bandh: అగ్నిపథ్కు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్?
వందల మంది పోలీసులు లోపలికి రావడంతో ఆందోళనకారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పోలీసులకు లొంగిపోయారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసుల ఆపరేషన్ ముగిసింది. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి క్షణాల్లోనే రైల్వే స్టేషన్ బయటకు తీసుకెళ్లారు. ఇంకా స్టేషన్ లోనే ఎవరైనా ఉన్నారేమోనని స్టేషన్ మొత్తం చెక్ చేశారు. ఇక ఇవాళ రాత్రంతా రైల్వే స్టేషన్ లో భారీ భద్రత ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఎందుకు కాల్పులు జరిపారు? ఒకరి ప్రాణం పోయే పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలకు దక్షిణ మధ్య రైల్వే జీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా సమాధానం ఇచ్చారు. పోలీసులు కనుక కాల్పులు జరపకపోయి ఉంటే ఇవాళ రైల్వేస్టేషన్ లో పెను ప్రమాదం జరిగుండేదన్నారు. దాన్ని నిరోధించడానికే కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.(Secunderabad Railway Station)
Agnipath : ఆర్మీ జవాన్ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి
మరోవైపు రైల్వే స్టేషన్ లో రైళ్ల రాకపోకలను పునరుద్దరించడానికి రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే సిబ్బంది రిపేర్ చేస్తున్నారు. గంటలోగా రెండు ట్రాకులను పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్.. అగ్గి రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ‘అగ్నిపథ్’ ద్వారా నాలుగేళ్లు మాత్రమే ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. యువతలో తీవ్ర ఆగ్రహానికి ఇదే ప్రధాన కారణం అవుతోంది. ఈ నిబంధనను నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. ఆందోళన బాట పట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మరోవైపు మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ జరిగింది.(Secunderabad Railway Station)
దాదాపు అన్ని రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జూన్18న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు బీజేపీయేతర పార్టీలు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఆర్మీని కూడా బీజేపీ ప్రైవేటీకరణ స్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అగ్నిపథ్ పథకాన్ని యువత తిరస్కరిస్తోందని వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు ఎన్డీయేతర పార్టీలన్నీ శనివారం నాటి బంద్ కు మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.