కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట్ పీఎస్ మహిళా కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
సాయికుమార్, శ్రుతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. సాయికుమార్ మృతదేహం ఆలస్యంగా లభ్యమైంది. గత అర్ధరాత్రి ఓ కారులో వారు ముగ్గురు చెరువు వద్దకు వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డారు.
వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్న వివరాలు తెలియరాలేదు. ఈ ఘటన మిస్టరీగా మారింది. నిన్న సాయంత్రం నుంచి ఎస్సై ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఎల్లారెడ్డి చెరువు వద్ద చివరి సారిగా కానిస్టేబుల్ శ్రుతితో సాయికుమార్ ఫోన్ కాల్ మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా తెలుస్తోంది.
జిల్లా ఎస్పీ సింధూ శర్మ గత అర్ధరాత్రి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్రుతి, నిఖిల్ మృతదేహాలను ఈతగాళ్లు బయటకు తీశారు. ఇవాళ ఉదయం 8.30 గంటలకు సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం. శ్రుతి గాంధారికి చెందిన మహిళ. ఆమె పదేళ్లుగా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రుతికి పెళ్లి జరిగి, విడాకులు తీసుకున్నారు. సాయికుమార్కు శ్రుతితో గతంలోనే పరిచయం ఉంది.