Smita Sabharwal: కాళేశ్వరం కేసు.. స్మితా సబర్వాల్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ ..
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
- Harishth Thanniru
- Published On : September 25, 2025 / 12:55 PM IST
Smita Sabharwal
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఆమెకు ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. స్మితా పిటిషన్ను ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది.
అసలేం జరిగిందంటే..?
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో స్మితా సబర్వాల్ పాత్రను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణాలను స్మితా సబర్వాల్ ఎప్పటికప్పుడు సందర్శించి, సమీక్ష చేసే వారని.. ఆ కన్స్ట్రక్షన్ ఫీడ్బ్యాక్ను అప్పటి సీఎం కేసీఆర్కు స్మితా సబర్వాల్ చేరవేసే వారని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం అడ్మినిస్ట్రేటివ్ అనుమతుల మంజూరులో స్మితా సబర్వాల్ కీలక పాత్ర ఉందని కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తెలిపింది. నిజానిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మితాపై చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.
జస్టిస్ ఘోష్ కమిషన్పై స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తన పేరుని ప్రస్తావించడంపై స్మితా సబర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను వివరణ ఇచ్చేందుకు తనకు 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
