Chinna Jeeyar Swamy: ఫిబ్రవరి 2 నుంచి సమతామూర్తి సహస్రాబ్ది మహోత్సవాలు -చినజీయర్‌ స్వామి

బంధనాలను పక్కకు తోసి భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్మాత్మక విప్లవమూర్తి, సమతా మూర్తి భగవాద్రామానుజులు నడయాడిన నేల పునీతమవబోతోంది.

Samatha Murthy Statue: బంధనాలను పక్కకు తోసి భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్మాత్మక విప్లవమూర్తి, సమతా మూర్తి భగవాద్రామానుజులు నడయాడిన నేల పునీతమవబోతోంది. శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని దివ్యసాకేతంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో ఆవిష్కృతం కాబోతున్న అద్భుత ఘట్టానికి అతిరథమహారథులు హాజరుకాబోతున్నారు.

ఈ బృహత్కార్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన్నజీయర్ స్వామి, మైహోం అధినేత డాక్టర్. జూపల్లి రామేశ్వరరావు ఇవాళ(20 సెప్టెంబర్ 2021) మీడియా ముందుకొచ్చారు. 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా జరగబోతున్నాయని, మొత్తం 12 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని, కార్యక్రమాలు చరిత్రాత్మకమని, చరిత్రకు వన్నె తెచ్చే మహోత్సవమని వెల్లడించారు. 200 ఎకరాల్లో వెయ్యి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల పంచలోహ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని, సీజేఐ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మైహోం గ్రూపు అధినేత డాక్టర్. జూపల్లి రామేశ్వర్‌రావు, మైహోం గ్రూపు డైరెక్టర్లు రంజిత్‌రావు, రామూరావుతో కలిసి ఆహ్వానాలు అందించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి. మహోజ్వల ఘట్టానికి తప్పకుండా హాజరవుతామని చినజీయర్‌స్వామికి వారు హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం ఏర్పాటు కాబోతుందని చెప్పారు. 12 రోజుల పాటు 128 యాగశాలల్లో 5 వేల మంది రుత్విక్కులు నాలుగు వేదాల పారాయణం చేస్తారని వెల్లడించారు. 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. దీని కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ అహోబిల జీయర్‌ స్వామి, దేవనాగర జీయర్‌ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు