Super Specialty Hospitals : ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో పేదలకు ఖరీదైన ట్రీట్మెంట్ను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వం.. మరిన్ని ఆస్త్రులను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. రాజధాని చుట్టూ నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
దగ్గు వచ్చినా.. జ్వరం వచ్చినా జనం వణికిపోతున్నారు. ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో…. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు ప్రజలు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా.. అదనంగా ఛార్జీలు వసూలు చేయడం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రజా వైద్య ప్రక్షాళనకు ప్రభుత్వం రెడీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. హైదరాబాద్ మహానగరంలో మరికొన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి పూనుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలనుంచి హైదరాబాద్కు వచ్చే నాలుగు మార్గాల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నిర్మించనుంది.
– కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించనుంది సర్కార్. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఇది వైద్యాన్ని అందించనుంది.
– హైదరాబాద్ నగర శివారు అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్య మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లా ప్రజలకు ఈ ఆస్పత్రి వైద్యసేవలు అందించనుంది.
– గచ్చిబౌలిలో టిమ్స్ ప్రజలకు ఓవిడ్ సేవలను అందిస్తోంది. దీన్ని ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించి ప్రభుత్వం. ఉమ్మడి వికారాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇది అందుబాటులోకి రానుంది.
– చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనుంది ప్రభుత్వం.
– వరంగల్ జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఈ ఆస్పత్రి సేవలందించనుంది.
ఏమూలన ఉన్న వారికైనా క్షణాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీలలో మౌళిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది భర్తీపైనా ఫోకస్ పెట్టింది. మొన్నటికి మొన్న అత్యాధునిక డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి సిద్ధమయ్యింది.