Yanamala: జైలుకెళ్లడం ఖాయం.. జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల రామకృష్ణుడు
షర్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడివి అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 10ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ...
- Harishth Thanniru
- Published On : October 28, 2024 / 10:36 AM IST
Yanamala Ramakrishnudu
Yanamala Ramakrishnudu: రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నాడు. ఎన్సీఎల్టిలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయాడు.. అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు.. జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకేనని యనమల అన్నారు. ఇది ఆస్తుల వివాదం కాదు.. ఇది రాజకీయ ఆత్మహత్యే. చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశాడు. వాళ్ల కుటుంబ తగాదాలు వాళ్లే రోడ్డుకీడ్చుకుని ఆ బురద మీడియాపైకి నెట్టడం హాస్యాస్పదం.
Also Read: IAS Postings AP : తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్లకు పోస్టింగ్స్.. ఆమ్రపాలికి ఏ పోస్టు అంటే?
షర్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడివి అంటూ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 10ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత నాలుగైదు రోజులుగా పుంఖానుపుంఖాలుగా జగన్ అక్రమాస్తుల రగడ మీడియాలోనే కాదు, పబ్లిక్ గా జరుగుతుంటే ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల్లో కదలికలేవి..? ఒక ఆర్ధిక నేరస్తుడు 11ఏళ్లుగా బెయిల్ పై ఉండటమేమిటి అంటూ యనమల ప్రశ్నించారు. 136డిశ్చార్జి పిటీషన్లు వేసి తనపై కేసుల విచారణను ముందుకు సాగకుండా ఇలా న్యాయవ్యవస్థకు, దర్యాప్తు సంస్థలకే పెనుసవాళ్లు విసురుతుంటే భారత రాజ్యాంగం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు.
జగన్ తీరుతో ఇప్పటికే అనేకమంది వైసీపీని వీడుతున్నారు. సురక్షిత ఆశ్రయంకోసం వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఇక భవిష్యత్ లో జగన్మోహన రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే. అందుకే ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న ఆరాటంతో పోటీపడి వైసీపీ నుంచి దూకేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం మునిగిపోయిన నావ, పూర్తిగా మునిగిపోకముందే అందరూ దూకేయడం బెటర్. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయం. పాత కేసులకుతోడు కొత్త కేసులు అనేకం ఆయన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తో ఉంటే అది ఆత్మహత్యా సదృశ్యమేనని యనమల రామకృష్ణుడు అన్నారు.
కొడుకుగా తల్లిదండ్రులను మోసం చేశాడు.. అన్నగా చెల్లెళ్లను మోసం చేశాడు.. పార్టీ పెట్టి నాయకులను, కార్యకర్తలను మోసం చేశాడు.. అధికారం చేపట్టి అన్నివర్గాల ప్రజలను మోసం చేశాడు. అవినాష్ రెడ్డిని కాపాడటంకోసం సొంత చిన్నాన్న కుటుంబాన్నే మోసం చేశాడు. చిన్నాన్నను కిరాతకంగా హత్యచేసిన హంతకులకు రక్షణ కల్పించడమే కాదు, ఆ పాపంలో తానూ భాగస్వామి అయ్యాడు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి సునీత ఉసురు పోసుకున్నాడు, వాళ్ల కన్నీళ్లే వైసీపీకి శాపాలయ్యాయి. ఇప్పుడు ఏకంగా తల్లినీ, చెల్లిని ఏడిపిస్తున్నాడు. సీఎంగా గత ఐదేళ్లలో 8లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు చేశాడని జగన్ మోహన్ రెడ్డిపై యనమల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
