Telangana BJP: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నలుగురు బీజేపీ అగ్రనేతలు.. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేస్తారంటే..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సిర్పూర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు.
- Harishth Thanniru
- Published On : November 25, 2023 / 09:51 AM IST
modi and amit shah and yogi
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఈనెల 30 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో చివరి నాలుగు రోజులు తెలంగాణలో పల్లెలు, పట్టణాలు నేతల ప్రచారాలతో హోరెత్తనున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతలు సైతం నియోజకవర్గాల వారిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఒక్కరోజు ముగ్గురు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రధాని కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొంటారు. అక్కడ సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ..
ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారపర్వంలోకి పాల్గొంటారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో ఉంటారు. పలు చోట్ల నిర్వహించే బహిరంగ సభలతోపాటు.. రోడ్షోల్లో పాల్గొంటారు.
– ఇవాళ (25వ తేదీ) మధ్యాహ్నం 1.25 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని నరేంద్రమోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో కామారెడ్డికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటలకు కామారెడ్డి సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రచారం చేస్తారు. అనంతరం 5 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్లోని రాజ్భవన్కు చేరుకుని.. ఈరోజు రాత్రి అక్కడే బస చేస్తారు.
– రేపు (26వ తేదీ) హైదరాబాద్ శివారులోని కొత్తూరు మండలం చేగూరులోని కన్హా శాంతి వనాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మధ్యాహ్నం తూఫ్రాన్ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతారు. సాయంత్రం హకీంపేట ఎయిర్పోర్టు నుంచి తిరుపతికి వెళ్లి.. రాత్రి అక్కడే బస చేస్తారు.
– 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగించిన తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు కరీంనగర్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ ఆరు జిల్లాల్లో సభలు ముగిసిన తర్వాత హైదరాబాద్లో రోడ్షోలో పాల్గొని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
అమిత్ షా పర్యటన ఇలా..
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. శనివారం ఉదయం 11 గంటలకు బీజేపీ మీడియా సెంటర్లో అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అనంతరం 11.30 కొల్లాపూర్, మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు, మధ్యాహ్నం 2గంటలకు పటాన్ చెరులో జరిగే సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలో పాల్గొంటారు.
జేపీ నడ్డా పర్యటన ఇలా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్యాహ్నం 1 గంటలకు హుజూర్ నగర్ లో పబ్లిక్ మీటింగ్ పాల్గొంటారు. సాయంత్రం 3.30 గంటలకు సికింద్రాబాద్ లో రోడ్డు షో, సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్ రోడ్డు షోలో పాల్గొంటారు.
యూపీ సీఎం పర్యటన ఇలా..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు సిర్పూర్ లో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు వేములవాడ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సనత్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలో భారీ రోడ్డు షోలో పాల్గొంటారు.
