Today Headlines: మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు
నేటి నుంచి మూడు రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
![Today Headlines: మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు Today Headlines: మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు](https://10tv.in/wp-content/uploads/2023/11/Head-lines-1.jpg)
Head lines (1)
మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు
మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆఫీసు టీం వర్క్స్ ను వాడుకున్నారని కాంగ్రెస్ నేత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు పంపింది. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్ నగర్ లోని చౌరస్తాలో విద్యార్థులు, నగరవాసులతో కలిసి రాహుల్ గాంధీ చాయ్ తాగుతూ ముచ్చటిస్తున్నారు. యువతతో రాహుల్ చిట్ చాట్ చేస్తున్నారు.
రైతు ఇంటికి వెళ్లిన ప్రియాంక గాంధీ
ప్రియాంక తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. హుస్నాబాద్లో సభ ముగించుకుని కిషన్నగర్ వైపు వెళ్తుండగా జరిగిన ఓ సంఘటన వైరల్ అవుతోంది. ప్రియాంక వెళ్తున్న కాన్వాయ్ను ఆపమంటూ రమాదేవి అనే మహిళ చేతులు ఊపింది. వెంటనే కాన్వాయ్ దిగిన ప్రియాంక ఆ మహిళతో పాటు ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఉండటంతో ప్రియాంక స్వామిని దర్శించుకుని ఆ మహిళతో పాటు సెల్ఫీ దిగారు.
పవన్ గాలి పీల్చేది అందుకే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమేనని విమర్శించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి బాధితులకు ఇచ్చిన డబ్బుల కన్నా ఆయన వచ్చి వెళ్లిన చార్టెడ్ ఫ్లైట్ ఛార్జీలకే అధిక రేటు అయ్యిందన్నారు.
కరాచీలో భారీ అగ్నిప్రమాదం
పాకిస్తాన్ లోని కరాచీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలో ఉ్న ఒక షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగడంతో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. కాగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
రాజస్థాన్ లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 68.24 శాతం పోలింగ్ నమోదైంది. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమదే విజయమని చెప్పుకుంటున్నారు.
కాల్పులు జరుపుకున్న బీజేపీ, బీఎస్పీ నేతలు
రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. కాగా ధోల్పూర్లోని బారీ అసెంబ్లీ నియోజకవర్గంలోని రజాయ్, అబ్దుల్పూర్ గ్రామాల్లో నకిలీ ఓటింగ్పై రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. రాజై గ్రామంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద భయాందోళన నెలకొంది.
కేసీఆర్ రిమోట్ మోదీ చేతిలో
కేసీఆర్ రిమోట్ మోదీ చేతిలో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ ఓటమే లక్ష్యమని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్లుగా తెలంగాణ కలలు నెరవేరకుండా అలాగే ఉన్నాయని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చే పనిలో ఉంటామని రాహుల్ అన్నారు.
మేమొస్తే రద్దు
భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కామన్ ఫ్రెండ్స్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు.
రెండూ ఒక్కటే
అవినీతి బీఆర్ఎస్ సర్కార్ను తరమికొట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ కు వేసినట్టేనని అన్నారు. తెలంగాణలో కమలం అధికారంలోకి వస్తుందని, అనంతరమే కేసీఆర్ అవినీతిని కక్కిస్తామని అన్నారు.
చెప్పింది చేసి తీరుతాం
‘‘తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు హమీ ఇచ్చాం. అది కూడా ఏర్పాటు చేసి చూపించాం. ఆయోద్య రామ మందిరం హమీ ఇచ్చాం, మందిరం నిర్మిస్తున్నాం. రైతులకు గిట్టుబాటు హామీ నెరవేర్చుకున్నాం. ఆర్టికల్ 370డీని రద్దు చేశాం. త్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం. అలాగే తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. మేము ఏం చేస్తామో అదే చెప్తాం. ఏది చెప్తామో దాన్ని నిజం చేసి చూపిస్తాం. మిగతా పార్టీలలా హామీలు ఇచ్చి వదిలేయము’’ అని కామారెడ్డి సభలో మోదీ అన్నారు.
కులగణన
వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని చెప్పారు.
కౌంటర్ అటాక్
ఆమ్ఆద్మీ సర్కార్తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే అన్నారు. కూతురుకోసం మోదీతో చేతులు కలిపారని ఖర్గే విమర్శించారు.
విమర్శలపర్వం..
బీడీ కార్మికులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
నిందితులు దొరికారు ..
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు. వాసుపల్లి నాని, సత్యంగా గుర్తించారు. బోటు ఇంజిన్పై సిగరెట్ పడటంతో ప్రమాదం చోటు చేసుకుందని, విశాఖ ఘటనలో నిందితులను గుర్తించామని సీపీ తెలిపారు.
అవినీతిపై ఉక్కుపాదం..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతిపరులను జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. SC వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
ఏచూరి ఫైర్..
దొడ్డి దారిలో ప్రభుత్వాల ఏర్పాటు బీజేపీ చరిత్ర అని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీకి సీబీఐ, ఈడీ, ఐటీ మిత్రపక్షాలంటూ ఏచూరి ఎద్దేవా చేశారు.
ఐటీ సోదాలు..
హైదరాబాద్, వికారాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పైలెట్ రోహిత్రెడ్డి సోదరుడి నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రాణం తీసిన వేగం ..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రెయిన్ ఎఫెక్ట్..
తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మీ రాక కోసం..
ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 14వ రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. టన్నెల్ వద్ద కుటుంబ సభ్యుల పడిగాపులు కాస్తున్నారు. కార్మికుల రాకకోసం ఎదురుచూస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. మూడు రోజులపాటు ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్భవన్, బేగంపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు.
అగ్గి.. బుగ్గి..
వెస్ట్ బెంగాల్ కుల్టీ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఐటీ నజర్ ..
హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీ బడా వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన భారీ నగదు సమకూర్చుతున్నారనే అనుమానంతో ఈ దాడులు చేపట్టారు. కోహినూర్ గ్రూప్స్, ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లల్లోను.. కింగ్స్ గ్రూప్ ల పేరుతో ఉన్న ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వంటి వ్యాపార సముదాయాల్లో ఈ సోదాలు జరుపుతున్నారు.
తగ్గని కాలుష్యం ..
ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. కళ్లమంట, గొంతు నొప్పితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బోధన్ లో పోస్టర్ల కలకలం ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్, బోధన్లో పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ రాకను నిరసిస్తూ రాహుల్, రేవంత్ రెడ్డి బొమ్మలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్.. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఈ పోస్టర్లపై రాశారు.
#WATCH | Nizamabad, Telangana: Protest posters on the visit of Rahul Gandhi are seen in Nizamabad and Bodhan. Posters state that 'the Congress party killed our children and demands an apology'. pic.twitter.com/s7mzODEBo8
— ANI (@ANI) November 25, 2023
పొలిటికల్ జాతర..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడవు ఉంది. దీంతో రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, జేపీ నడ్డా వంటి నేతలు బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
చైనా కీలక నిర్ణయం ..
వ్యాపారం, పర్యాటక రంగాలను ప్రోత్సహించటంలో భాగంగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు దేశాల ప్రజలకు వీసా లేకుండా చైనాలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది. ఐదు యూరోపియన్ దేశాలతో పాటు, మలేషియా ప్రజలు వీసా లేకుండానే చైనాలో పర్యటించవచ్చని ప్రకటించింది.
స్టాలిన్ కౌంటర్ ..
తమిళనాడులోని ఆలయ ఆస్తులను చోరీ చేసి విదేశాలకు విక్రయిస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. డీఎంకే నేతృత్వంలోని ద్రవిడ మోడల్ ప్రభుత్వం 5వేల 500 కోట్ల విలువైన ఆలయ ఆస్తులను రికవరీ చేసిందని తెలిపారు. బీజేపీకి భక్తి ఉంటే ఈ ఆస్తులను తిరిగి పొందినందుకు డీఎంకే ప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. అయితే వారి భక్తి కేవలం ప్రజలను మోసం చేసేందుకు రూపొందించిన పగటిపూట చర్యగా అంటూ విమర్శించారు.