Revanth Reddy: శ్వేతపత్రాన్ని ఎందుకు విడుదల చేశారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని చెప్పారు. తాము ప్రకటించిన గ్యారంటీలను..
- T Venkateshwarlu
- Published On : December 20, 2023 / 06:41 PM IST
Revanth Reddy
White Paper presenting: పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో, అవమానించడానికో కాదని చెప్పారు. తాము ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదని తెలిపారు.
నిజాలను ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేశామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోనే శక్తిమంతమైన రాష్ట్రంగా నిలబెట్టడం తమ లక్ష్యమని తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు నుంచి కూడా వివరాలు తీసుకున్నామని తెలిపారు.
పదేళ్ల క్రితం రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున అందులో సగం రోజులు కూడా లేవని తెలిపారు. అప్పు కావాలంటూ ప్రతిరోజు వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు.
తాము రాజాకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని చెప్పారు.
