Telangana Cabinet : 24గంటల విద్యుత్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

మిగిలిన 4 గ్యారంటీలపై మరోసారి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Telangana Cabinet Decisions

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. మొదటి క్యాబినెట్ భేటీలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారెంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తాము హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నుంచి రెండు గ్యారెంటీలు అమల్లోకి వస్తాయన్నారు. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మరొకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు. ఇక, మిగిలిన 4 గ్యారెంటీలపై మరోసారి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు శ్రీధర్ బాబు.

ఇక, రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలాగే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందేలా చూస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. 2014-2023 డిసెంబర్ 7 వరకు అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వ ఖర్చులపై కేబినెట్ లో చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి ఆదాయ-వ్యయ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై వివరాలు తెలిపాలని అధికారులను కోరామన్నారు శ్రీధర్ బాబు.

ఉచిత విద్యుత్ అమలుపై సీఎం సమీక్ష..
”రేపు(డిసెంబర్ 8) విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా విద్యుత్ కు సంబంధించి ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు జరగలేదు” అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Also Read : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

బస్సుల్లో ఫ్రీగా వెళ్లాలంటే అది తప్పనిసరి- మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా జర్నీ చేయొచ్చన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. అమలులో ఏమైనా సమస్యలు తలెత్తితే సమీక్షించి మార్పులు చేస్తామని వెల్లడించారు.

Also Read : కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. అమలు ఎలా? ఎంత డబ్బు కావాలి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

 

 

ట్రెండింగ్ వార్తలు