Duplicate Vote: రెండు చోట్ల ఓటు ఉందా.. అయితే జైలుకు వెళ్లడం ఖాయం.. తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటు(Duplicate Vote) హక్కు ఉండటం తీవ్రమైన నేరమని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
- V Santhosh Kumar
- Published on- July 11, 2026 / 02:06 PM IST
Telangana CEO Sudarshan Reddy stating that having vote in two places could lead to a one year jail sentence
- రెండు ఓట్లు ఉంటే జైలు
- ఆగస్టు ఒకటి నుండి అవకాశం
- సాఫ్ట్వేర్తో నకిలీ ఓట్ల ఏరివేత
Duplicate Vote: ప్రజాస్వామ్యంలో పౌరుడికి లభించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. అయితే, అర్హత గల ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించడంతో పాటు, ఆ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో, ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓటు(Duplicate Vote) హక్కు ఉండటం తీవ్రమైన నేరమని స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ వేదికగా ఆయన ఓటర్ల జాబితా ప్రక్షాళన, డూప్లికేట్ ఓట్ల ఏరివేతపై సుదీర్ఘంగా వివరించారు.
డూప్లికేట్ ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష:
చట్టాన్ని ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో గానీ, లేదా రెండు వేర్వేరు రాష్ట్రాల్లో గానీ ఓటు హక్కును కలిగి ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. అటువంటి వ్యక్తులకు ఏడాది పాటు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి డూప్లికేట్ ఓట్లను కలిగి ఉన్న పలువురిని గుర్తించి, వారికి చట్టపరమైన నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన అత్యాధునిక ‘డీఎస్ఈ’ (డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్) సాఫ్ట్వేర్ సాయంతో ఒకే పేరు, పోలికలతో ఉన్న నకిలీ ఓట్లను అత్యంత పారదర్శకంగా ఏరివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 1 నుంచి సవరణలకు మరో అవకాశం:
ప్రస్తుతం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ వేగంగా సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని సీఈఓ తెలిపారు. ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ రోల్) లో పేరు ఉండాలనుకునే వారు ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని సూచించారు. ఒకవేళ ఇప్పటికే జాబితాలో పేరు లేని వారు ఉంటే, వారికి ఆగస్టు 1వ తేదీ నుంచి ఫారమ్-6, ఫారమ్-8 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవడానికి లేదా సవరణలు చేసుకోవడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఓటరు జాబితా నుండి ఎవరి పేరునైనా తొలగించాల్సి వస్తే సంబంధిత ఈఆర్వోలు (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్) ఖచ్చితంగా రాతపూర్వక కారణాలు చూపాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల నమోదుకు ఎదురవుతున్న ఇబ్బందులపై తాము ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.
