CM KCR : కొండగట్టు అంజన్న సేవలో సీఎం కేసీఆర్..కొండగట్టు అభివద్ధిపై సమీక్ష
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని సీఎం కేసీఆర్ సందర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు గంటలపాటు ఆంజనేయస్వామి సన్నిధిలోనే గడిపారు.
- nagamani
- Published On : February 15, 2023 / 12:34 PM IST
CM KCR In Kondagattu Hanuman Temple
CM KCR In Kondagattu Hanuman Temple : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని సీఎం కేసీఆర్ సందర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు గంటలపాటు ఆంజనేయస్వామి సన్నిధిలోనే గడిపారు కేసీఆర్. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలు అందించారు. అధికారులు అంజన్న తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు. కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై మంత్రులు, అధికారులతోను చర్చించనున్నారు.
అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులపై చర్చించనున్నారు. ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ భక్తులకోసం సకల సౌకర్యాలు చేకూర్చేలా తీసుకునే విషయాలపై చర్చించనున్నారు.
