godavari river crossed 61 feet level at bhadrachalam : గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం నీటి మట్టం 61 అడుగులు దాటింది. దీంతో భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిన్న సాయంత్రం 5గంటల నుంచి నిలిపివేశారు. రక్షణ చర్యల్లో భాగంగా వంతెనపై రాకపోకలను 48 గంటలపాటు నిలిపివేశామని కలెక్టర్ వెల్లడించారు. భద్రాచలంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. దీంతో హై అలర్ట్ కొనసాగుతోంది.
ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నీటిమట్టం 61 అడుగులు దాటటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ప్రమాద హెచ్చరికను దాటి ఐదు అడుగులకుపైగా నీరు ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం కరకట్టను తాకడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముంపు వాసులను పునరావాస కేంద్రాలను తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.