Telangana Govt Invited Governor : బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. గవర్నర్ తమిళిసైతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.
- bheemraj
- Published On : January 31, 2023 / 12:09 AM IST
Governor
Telangana Govt Invited Governor : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. గవర్నర్ తమిళిసైతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి ప్రభుత్వం తరపున గవర్నర్ ను ఆహ్వానించేందుకు వెళ్లిన ఆయన అసెంబ్లీ ప్రోరోగ్ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు కూడా రాజ్ భవన్ కు వెళ్లారు.
వచ్చే నెల 3న బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని గవర్నర్ తో చర్చలు జరిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్ నుంచి ప్రగతి భవన్ కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుతో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్థతకు తెర పడింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వం, ఆటు రాజ్ భవన్ తరపు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగ బద్ధంగా నిర్వహించేందుకు నిర్ణయించుకున్నామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇటు రాజ్యాంగ బద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహిస్తారని రాజ్ భవన్ తరుపు న్యాయవాది తెలిపారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు ఏర్పడ్డాయి.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరినప్పటికీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ట్విస్ట్ నెలకొంది. 8వ సెషన్ ను తెలంగాణ అసెంబ్లీ ప్రోరోగ్ చేయకుండా 4వ అసెంబ్లీ సమావేశాల పేరుతో ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్టికల్ 173 ప్రకారం బడ్జెట్ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే 8వ సెషన్ కొనసాగితే గవర్నర్ ప్రసంగంపై అనుమానం వ్యక్తం అవుతుంది.
దీంతో 8వ సెషన్ ప్రోరోగ్ చేసి 9వ సెషన్ ప్రారంభిస్తారా? లేక 8వ సెషన్ లోనే గవర్నర్ ప్రసంగం పెడతారా? ఒకవేళ గవర్నర్ ప్రసంగం అలా పెట్టేందుకు సభా సంప్రదాయాలు అనుకూలంగా ఉంటాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
