Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్లో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇల్లు!
Telangana Govt : తెలంగాణలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ..
- Harishth Thanniru
- Published On : December 8, 2025 / 07:34 AM IST
Revanth Reddy
Telangana Govt : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. ఈ రెండేళ్ల కాలంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల ఆర్థిక అభ్యునతి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ వర్గాల ప్రజలకోసం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న సర్కార్.. మరికొన్ని కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో పేద వర్గాల ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చుతున్న ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆపర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందిస్తోంది. ఈ పాలసీ ఆధ్యయనం కోసం జీహెచ్ఎంసీ, హచ్ఎండీఏ, హౌసింగ్, డీటీసీపీ ఆఫీసర్లతో ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. విజన్ 2047 ప్లాన్లో భాగంగా ఈ పాలసీకి హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతోపాటు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జీప్లస్ -3 పద్దతిలో నిర్మించనున్న ఇండ్ల వివరాలను హౌసింగ్ శాఖ పాలసీలో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్యూర్, క్యూర్, రేర్ లో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను సైతం ఈ ప్లాన్లో ప్రస్తావించారు. స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అయిన టైర్ 2,3 సిటీల్లో సైతం టౌన్షిప్లను నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
మధ్య తరగతి ప్రజలకోసం అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించనుంది. ఈ రెండు రోడ్ల మధ్య సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ టౌన్షిప్ల నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీసైతం రుణాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. టెండర్లు పిలిచి పీపీపీ పద్దతిలో ఈ టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి మార్కెట్ ధరల కంటే తక్కువకు ఇండ్లను అందుబాటులో ఉంచనున్నారు.
