Telangana Government: తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి లక్ష ఆర్ధిక సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకి
తెలంగాణ(Telangana Government)లోని నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
- V Santhosh Kumar
- Updated on- September 16, 2026 / 08:56 PM IST
Telangana government to provide 1 lakh under rajiv yuva vikasam scheme
- రూ.లక్ష ఆర్థిక సాయం
- నవంబర్ 19న పంపిణీ
- ఖాతాల్లో నేరుగా జమ
Telangana Government: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సొంతంగా ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలనుకునే యువతకు రాజీవ్ యువ వికాసం పథకం(Telangana Government) ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం అమల్లో భాగంగా లబ్ధిదారులకు నగదు పంపిణీ ప్రక్రియను నవంబర్ 19వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన నిరుద్యోగులకు సొంత వ్యాపారాలు లేదా ఉపాధి యూనిట్లు నెలకొల్పుకోవడానికి ఈ ఆర్థిక సాయం ఎంతో దోహదపడనుంది. గతంలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి, వచ్చిన అర్జీలను పరిశీలించిన అధికారులు తుది లబ్ధిదారుల జాబితాను సైతం సిద్ధం చేశారు. ప్రజాభావన్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కలిసి ఈ పథకం పురోగతిపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ.. అధికారులకు ఆదేశాలు:
ప్రజాధనం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ అయ్యేలా పారదర్శక చర్యలు చేపట్టాలని, నవంబర్ 19 కల్లా అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించి, ఇప్పటికే అర్హులను ఎంపిక చేసింది. ఈ సాయం ద్వారా యువత తమకు నచ్చిన రంగాల్లో స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు కూడా అవకాశాలు కల్పించేలా ఎదగవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
