తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. ఆ తేదీలోగా నిర్వహించాలని ఆదేశం..
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- Harishth Thanniru
- Published On : June 25, 2025 / 10:45 AM IST
Sadabainamas
Telangana High Court: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ మాధవీదేవి బెంచ్ తీర్పును ప్రకటించింది. మూడు నెలల్లో అంటే.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
2024 జనవరి 31వ తేదీన సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ హైకోర్టులో ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయం వెలువరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి 60రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటీషన్లపై ఈనెల 23వ తేదీనే వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తాజాగా.. జస్టిస్ మాధవీదేవి బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది.
