Telangana Constable Recruitment (Photo : Google)
Telangana Constable Recruitment : తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ (తుది) పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి, అందరికీ 4 మార్కులు కలిపి తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించాలని, ఆ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించ లేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ 4 ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని తప్పుపట్టిన కోర్టు.. మళ్లీ మూల్యాంకనం చేసి ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపట్టాలని పేర్కొంది.
కాగా, ఈ నెల 4న కానిస్టేబుల్ తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 15వేల 750 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఇప్పటికే విడుదలైంది. 12వేల 866 మంది పురుషులు.. 2వేల 884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. తాజాగా హైకోర్టు తీర్పుతో మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : బీజేపీ హంగ్ ఆశలు.. ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం!
కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్ వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపికైన అభ్యర్థులు షాక్ అవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగాల భర్తీ పూర్తి అవ్వలేదని నిరుగ్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దైంది. గ్రూప్-2 నిరవధిక వాయిదా పడింది. ఇక, గ్రూప్ 4 ఫలితాలు ఇంకా వెలువడలేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఇక, ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ లేనట్లేని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
Also Read : హోరాహోరీగా సూర్యాపేట రాజకీయం.. కాంగ్రెస్ తలరాత మారుతుందా?