×
Ad

High Court : హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్-1 ర్యాంకర్లకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీకి భారీ ఊరట..

High Court : గ్రూప్-1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

Telangana High Court

High Court : గ్రూప్-1 మెయిన్స్ విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన కోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.

గ్రూప్-1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్-1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం హైకోర్టు డివిజన్‌ బెచ్ విచారణ జరిపింది.

2011లో గ్రూప్‌-1 నిర్వహించారు. ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసింది. 14 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 నియామకాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రక్రియను సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసింది. తెలుగులో మెయిన్స్‌ జవాబులు రాసిన వారిపట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రూప్-1 పోస్టులు భర్తీ కాలేదా..? 2014 నుంచి అసలు గ్రూప్-1 రిక్రూట్మెంట్ జరగలేదా..? అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు 2014 నుంచి టీజీపీఎస్సీ ఉనిలో ఉందా.. అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరటనిస్తూ నియామకాలు జరుపుకోవచ్చునని.. అయితే, ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే.. 

గ్రూప్-1 మెయిన్స్ ర్యాంకింగ్స్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈనెల 9వ తేదీన హైకోర్టు సింగిల్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తిరిగి రివాల్యూయేషన్ నిర్వహించాలని.. లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇటీవల డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.

ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట లభించింది.