Telangana Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా.. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఇవే.
- T Venkateshwarlu
- Published On : February 12, 2023 / 05:24 PM IST
Telangana Assembly
Telangana Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఇవే.
ఇవాళ కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ పాలనలో ఒక్క రంగంలోనైనా వృద్ధిరేటు ఉందా? అని నిలదీశారు. మన దేశంలో చాలినంత నాణ్యమైన బొగ్గు ఉందని అన్నారు. అయినప్పటికీ, కొందరు పారిశ్రామిక స్నేహితుల కోసం మోదీ రాష్ట్రాల మెడలపై కత్తులు పెట్టి విదేశాల నుంచి బొగ్గు కొనిపిస్తున్నారని అన్నారు.
దేశంలో దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల విద్యుత్ ఎందుకు సాధ్యం కాదని నిలదీశారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ జనాభా గణన ఆగలేదని కానీ, ఇప్పుడు మాత్రం ఆపారని కేసీఆర్ విమర్శించారు. జనాభా లెక్కలు జరిగితే బండారం బయట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, జనాభా గణన చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అడుగుతున్నారని చెప్పారు.
తాను గతంలో మోదీని నమ్మి నోట్ల రద్దును సమర్థించానని, దేశాన్ని బాగుచేయలేని విశ్వగురువులెందుకని అన్నారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని, మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు తినాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. అదానీ, అంబానీలకు కాకుండా రైతుల పిల్లలకు అప్పులు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు.
Amit Shah: సీపీఎంతో జట్టు కట్టడం కాంగ్రెస్కు సిగ్గు చేటు: కేంద్ర మంత్రి అమిత్ షా
