Minister Jagadish Reddy : విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ని 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్ సీ నిర్ణయంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. ఆదాని లాంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. సంస్కరణల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గం చేస్తుందని మండిపడ్డారు.
కేంద్రం తెచ్చేవి సంస్కరణలు కావు.. ప్రజలను పీల్చి పిప్పిచేసే నల్ల విద్యుత్ చట్టాలు అని అభిర్ణించారు. విద్యుత్ విషయంలో కేంద్రం తప్పుడు విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కేంద్ర నిర్ణయంతో సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చంటే ప్రజలను చీకట్లోకి నెట్టి దోపిడీ చేయడమేనని పేర్కొన్నారు. దేశంలో సొంత బొగ్గు వనరులు ఉండగా కేంద్రం విదేశీ బొగ్గు ఎందుకు తెస్తుందని నిలదీశారు.
Power Crisis : తెలంగాణలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు – జగదీశ్ రెడ్డి
ఆదాని విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు కేంద్రం అమ్మిస్తోందని చెప్పారు. విదేశీ బొగ్గు తోనే విద్యుత్ సమస్య ఏర్పడనుందని పేర్కొన్నారు. కేంద్ర ఈ ఆర్ సీ నిర్ణయం ఆదానికే లాభం అని వెల్లడించారు. కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి ఆదానీకి మేలు చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించి ప్రజలకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. దేశ భక్తి మాటున దేశానికి బీజేపీ ద్రోహం చేస్తోందన్నారు.
మోదీ, ఆదానీల స్నేహ బంధం ప్రజలకు అర్థమౌతుందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నిర్మలా సీతారామన్ ఎవరిదో స్క్రిప్ట్ చదువుతుందని ఎద్దేవా చేశారు. ఎఫ్ఆర్ బీఎమ్ పరిధిలోనే రాష్ట్ర అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. అబద్దాలు చెప్పి నిర్మలా సీతారామన్ ప్రజలకు దొరికిపోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందన్నారు. తెలంగాణా అప్పులు ప్రజల అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఏం చేసినా బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు.