telangana mlc poll : రెండోసారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం

  • Updated on- March 21, 2021 / 06:03 AM IST

Palla

Palla Rajeshwar Reddy : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్)పై 12 వేల 806 ఓట్లతో గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2021, మార్చి 20వ తేదీ శనివారం రాత్రి ఫలితం వెలువడింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలుపొందారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకుంది. పల్లాకు మొత్తం 1,61,811 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు టీఆర్ఎస్‌కు మోదాన్ని కలిగిస్తే బీజేపీకి ఖేదాన్ని కలిగించాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని వ్యూహరచన చేసింది. విజయం సాధించింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జరిగిన ఎదురుదెబ్బకు ప్రతీకారం తీర్చుకునేలా పకడ్బందీగా వ్యవహరించింది అధికారపార్టీ. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.