Congress Party Ready To Kcr Early Elections Challenge
Uttam Kumar Reddy : సీఎం కేసీఆర్ చేసిన ముందస్తు ఎన్నికల సవాల్ కు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సై అంటున్నాయి. ఆదివారం (జులై 10,2022) మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బిజెపి ఫై మరోసారి విరుచుకుపడ్డారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా?అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ సవాల్ కు కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు కూడా సవాల్ కు రెడీ అంటూ సమాధానమిచ్చారు.
దీంట్లో భాగంగా సీఎం కేసీఆర్ సవాల్ పై కాంగ్రెస్ సీనియర నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)స్పందించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నువ్వు సవాల్ చేయడం కాదు.. ముందు అసెంబ్లీ రద్దు చేయ్ అంటూ సవాల్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ రద్దు చేయాలని శాసనసభ రద్దయితే ఆటోమెటిక్గా ఎన్నికలు వస్తాయని..ఎన్నికలకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. మొత్తం మీద కేసీఆర్ ముందస్తు మాటతో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఇదే అంశంపై బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని..అయినా..కేసీఆర్ సర్కార్ను పడగొట్టే అవసరం తమకు లేదన్నారు. టీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ముందస్తు ఎన్నికల అంశాన్ని కేసీఆర్ తెరమీదకు తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖంలో అపజయం భయాన్ని ప్రజలందరూ గమనించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేసినా ఆయన కుటుంబం బాగు పడటానికి మాత్రమేనని..ప్రజల కోసం ఏమాత్రం కాదని విమర్శించారు.