Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జన అనుమతి పిటిషన్ కొట్టిపారేసిన హైకోర్టు
గణేశ్ నిమజ్జనంపై హైదరాబాద్ వ్యాప్తంగా సందిగ్ధత నెలకొంది. ముందుగా చెప్పినట్లే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ససేమిరా కుదరదని హైకోర్టు చెప్పేసింది.
- Subhan Ali Shaik
- Published On : September 13, 2021 / 03:39 PM IST
Ganesh Nimajjanam
Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనంపై హైదరాబాద్ వ్యాప్తంగా సందిగ్ధత నెలకొంది. ముందుగా చెప్పినట్లే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ససేమిరా కుదరదని హైకోర్టు చెప్పేసింది. మరోసారి పరిశీలించాలంటూ.. హైకోర్టులో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ రివ్యూ పిటీషన్ దాఖలు చేసి తీర్పును పునః పరిశీలించాలని కోరినా ఉపయోగం లేదు.
సింథటిక్ కెమికల్స్ వాడొద్దని ఆంక్షలు ఎందుకు విధించలేదని ప్రశ్నించింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వమే సహకరించాలని కోరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది కోర్టు. గతేడాది ఆదేశాలు పట్టించుకోలేదని.. ఇంతకుముందు కౌంటర్లలో ఇబ్బందులు ఉన్నాయని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ఉత్తర్వుల్లో ఎటువంటి మార్పులు లేవని హైకోర్టు తేల్చి చెప్పేసింది.
ఏటా చేస్తున్నట్లుగానే హుస్పేన్ సాగర్లో నిమజ్జనానికే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కానీ, ఉన్నపళంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నగర వ్యాప్తంగా గందరగోళంలో పడేశాయి. ఈ నేపథ్యంలోనే.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్లో అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: AAP on Modi Govt: ‘మోదీ ప్రభుత్వ ఫేవరేట్ ఏజెన్సీ నుంచి లవ్ లెటర్ వచ్చింది’
దాని కోసం ప్రత్యేకంగా తయారుచేయాల్సిన రబ్బరు డ్యామ్ నిర్మాణానికి కొంత సమయం అవసరమవుతుందని పేర్కొంది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు నగరం పరిధిలో లేవని జీహెచ్ఎంసీ పిటిషన్లో పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హైకోర్టు ధర్మాసనానికి జీహెచ్ఎంసీ విన్నవించింది.
