Omicron Scare : భారత్లో 200కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. తెలంగాణ రెండో స్థానం..
భారత్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
- Sreehari A
- Published On : December 21, 2021 / 11:53 AM IST
Telangana Second Place In Omicron Cases After Maharastra And Delhi In India
Omicron Scare : భారత్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఇతర రాష్ట్రాలు ఉన్నాయి.
మహారాష్ట్రలో 54 కేసులు, దేశరాజధాని ఢిల్లీలో 54 ఒమిక్రాన్ కేసులతో మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణ 20 కేసులతో రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 200కి చేరింది. ఢిల్లీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో, ఢిల్లీలో, తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత రాజస్థాన్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొద్తం 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. ఇప్పటివరకూ దేశంలో ఒమిక్రాన్ నుంచి 77 మంది కోలుకున్నారు.
India has a total of 200 cases of #OmicronVariant so far: Ministry of Health and Family Welfare pic.twitter.com/zq7AJ0Oqqj
— ANI (@ANI) December 21, 2021
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు :
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య అధికార బృందం అప్రమత్తమైంది. కట్టడికి తగు చర్యలు తీసుకుంటుంది. కాగా విదేశాల నుంచి వచ్చిన 10 మందికి.. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి డిసెంబర్ 18న పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 21 మంది ఒమిక్రాన్ బాధితులను గుర్తించారు. వీరిని కలిసిన వారికి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి రాబోతుంది.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే, రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ఈ ప్రక్రియ అందుబాటులోకి వస్తే పని వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు డాక్టర్లు. గాంధీలోనే జీనోమ్ సీక్వెన్సింగ్తో త్వరగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
