తెలంగాణలో 15 ఏళ్లు నిండిన వాహనాలు తుక్కు కావాల్సిందే!

ప్రాంతీయ రవాణా అథారిటీ వాహన స్క్రాపేజ్ విధాన ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసి..

వాహనాలు తయారుచేసి 15 ఏళ్ల సమయం దాటితే అవి ప్రమాదకరంగా, కాలుష్య కారకంగా మారతాయి. ఇటువంటి వాహనాలు రోడ్లపై తిరిగితే ఉపేక్షించవద్దని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ వాహనాల జీవిత కాలపరిమితిపై వచ్చే ఏడాది ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

వాహనాలు కొనుగోలు చేసి 15 సంవత్సరాలు దాటితే వాటిని తుక్కు కింద మార్చాలి. అలాగే, వాటి రిజిస్ట్రేషన్‌ రద్దయిపోతుంది. అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది. వాహనాల యజమానులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. వాహనాన్ని స్క్రాప్‌కి ఇచ్చేయాలి. అలాగాకుండా ఆ వాహనాలతోనే రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే, ఫిట్‌నెస్ పరీక్షలో వాహనం పాస్ అయితే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి, ఆ వాహనాన్ని అదనంగా 3-5 సంవత్సరాలు వాడుకోవడానికి అనుమతి పొందవచ్చు. అయితే, 15 ఏళ్లు నిండిన తర్వాత స్క్రాప్ చేయాల్సిన దాదాపు 10 వేల ప్రభుత్వ వాహనాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు.

ఈ మేరకు ప్రాంతీయ రవాణా అథారిటీ వాహన స్క్రాపేజ్ విధాన ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసి దాని ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం, 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించని ఏకైక రాష్ట్రంగా ఢిల్లీ ఉంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాలు తెలంగాణలో ఇప్పుడు ప్రతిపాదించిన విధానం వంటి నిబంధనలనే అమలు చేస్తున్నాయి.

ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణ 30 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 15 ఏళ్లు నిండిన 20 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో 17 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లతో పాటు లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నాయి.

Gold: అధిక లాభాల కోసం కొత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..