Telangana Government : ఉద్యోగుల విభజన కోసం విధివిధానాలు ఖరారు
ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- bheemraj
- Published On : December 6, 2021 / 09:52 PM IST
Employees
modalities for the separation of employees : ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరగనుంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ బీ ఆర్ కే భవన్లో సమీక్ష నిర్వహించారు.
ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా శాఖల జిల్లా అధిపతులను సభ్యులుగా నియమించింది. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికి పైగా సమస్య ఉన్న దివ్యాంగులకు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్న ఉద్యోగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించనున్నారు. విభజన, కేటాయింపులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
