Governor Indrasena Reddy : నాకు గవర్నర్ పదవి రావటం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు : ఇంద్రసేనారెడ్డి
ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమిస్తు రాష్ట్రపతి కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
- nagamani
- Published On : October 19, 2023 / 03:47 PM IST
Indrasena Reddy
Tripura Governor Indrasena Reddy : బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమిస్తు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి నియామక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇంద్రసేనారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. త్రిపుర గవర్నర్ గా నియామకం పట్ల ఇంద్రసేనారెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పలువురు బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గవర్నర్ పదవి రావటం రేవంత్ రెడ్డికి ఇష్టంలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇతరులను ఇబ్బందులకు గురి చేయటమే రేవంత్ రెడ్డి పని అంటూ విమర్శించారు. రెడ్డి సమాజం అంతా తన వెనుకే ఉంటుంది అంటున్నారని రెడ్డి సమాజాన్ని విభజించే యత్నం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. తాను రెడ్డి ప్రతినిధిని అంటూ ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు అంటూ గుర్తు చేశారు.కాంగ్రెస్ కు రాజకీయాలు చేయటం తప్ప మరొకటి రాదు అంటూ విమర్శించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతు..తన పని తీరు మోదీకి తెలుసన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలని ఆయనకు తెలుసన్నారు. గతంతో పోలిస్తే ప్రధాని మోదీ ప్రభుత్వం హాయంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని అన్నారు. త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తనకు గవర్నర్ పదవి రావటం అంటే ఇది మలక్ పేట ప్రజల గుర్తింపే అని అన్నారు. ఎందుకంటే ఇంద్రసేనా రెడ్డి మలక్ పేట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1983, 1985, 1999 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తనకు గవర్నర్ పదవి వచ్చిన సందర్భంగా తన నియోజవర్గం అయిన మలక్ పేటను గుర్తు చేసుకున్నారు. కాగా..సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, గానుగబండ గ్రామానికి చెందిన ఇంద్రసేనా రెడ్డి 40 ఏళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నారు.
కాగా..కాగా ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించటంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది.దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి సీఈసీ రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న క్రమంలో స్థానిక వ్యక్తిని గవర్నర్ గా నియమించటం పట్ల అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది ఓటర్లను ప్రభావితం చేసే అకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
