IMD Alert : తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
- Sreehari A
- Published On : July 16, 2021 / 07:24 AM IST
Ts Rain Alert Telangana Heavy Rains In These Districts
Telangana Heavy Rains : ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్ అర్బన్, గ్రామీణం, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి పోర్లుతున్నాయి. జలాశయాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈశాన్య రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరికి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారురు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని బస్వాపూర్ వద్ద వరద ఉధృతంగా అధికంగా ఉంది.
బస్వాపూర్ సమీపంలో ఉన్న వాగులకు వరదనీరు పోటెత్తింది. సిద్దిపేట-హన్మకొండ రోడ్డులో బ్రిడ్జిపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నంగునూరు, ధూళిమిట్ట మండలాల్లో చెక్డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్, మానకొండూరు, శంకరపట్నం, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, గంగాధర, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, చందుర్తి, మెట్పల్లిలో భారీ వర్షం పడింది. కథలాపూర్ మండలంలో కురిసిన వర్షాలతో వరదకాలువ బ్రిడ్జిపై భారీగా నీరు నిలిచిపోయి, రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక ఈ సీజన్లో ఇప్పటికే 51శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
