Uttam Kumar Reddy
ముచ్చుమర్రి ప్రాజెక్ట్ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణకు మరణశాసనమని చెప్పారు.
ప్రతిరోజూ 3 టీఎంసీలు తరలించేందుకు గత కేసీఆర్ సర్కార్ సహకరించింది నిజమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్తో అలయ్ బలయ్ చేసుకుని.. కృష్ణా నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని చెప్పారు. ఏపీ దోచుకునేందుకు కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్, హరీశ్ రావు ఏపీ కోసమే పనిచేశారని అన్నారు.
రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యేవరకు తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ రావులు అని పేరు మార్చుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల అసత్యాలను చూసి ఆశ్చర్యపోయేవారని అన్నారు.