Kishan Reddy: తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి.. ఈ ఏడాది చివరిలోగా.. మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు
- V Santhosh Kumar
- Published on- August 30, 2026 / 03:20 PM IST
Vikarabad Railway Station, Kishan Reddy
- రైల్వే స్టేషన్ పనుల పరిశీలన
- రూ.27 కోట్లతో ఆధునిక సౌకర్యాలు
- ఈ ఏడాది చివరికే పూర్తి
Kishan Reddy: తెలంగాణలోని రైల్వే మౌలిక సదుపాయాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన, నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Guntur Murder: 20 ఏళ్లుగా ఎదురుచూసి.. పట్టపగలే నరికి చంపి.. గుంటూరులో దారుణం
రూ.27 కోట్లతో ఆధునిక సౌకర్యాలు:
సుమారు రూ.27 కోట్ల అంచనా వ్యయంతో వికారాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్, రెండు అత్యాధునిక లిఫ్టులు, శుభ్రమైన క్యాంటీన్ సదుపాయం, దివ్యాంగులకు ప్రత్యేకమైన ఆధునిక వసతులను కల్పిస్తున్నట్లు వివరించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా ఈ ఏడాది చివరి నాటికే ఆధునికీకరణ పనులన్నింటినీ పూర్తి చేసి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి:
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. కేవలం వికారాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. వికారాబాద్ ప్రాంత సమగ్ర పురోగతికి మెరుగైన రైల్వే కనెక్టివిటీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు, సుఖమయ ప్రయాణ అనుభూతి లభిస్తాయని పేర్కొన్నారు.
