Vivek Venkataswamy : కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి
అందరూ ఊహించినట్టుగానే వివేక్ వెంటకస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కొడుకు వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
- bheemraj
- Published On : November 1, 2023 / 11:51 AM IST
Vivek Venkataswamy Joined Congress
Vivek Venkataswamy Joined Congress : బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్వయంగా ఆయనను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో రాహల్ గాంధీ వద్దకు వివేక్ కుటుంబ సమేతంగా వచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.
అంతకుముందు బీజేపీకి వివేక్ రాజీనామా చేశారు. చాలా బాధతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్టీలో తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఆయన తోసిపుచ్చారు. చివరకు అందరూ ఊహించినట్టుగానే బీజేపీని వీడి హస్తం పార్టీ గూటికి చేరుకున్నారు.
కాగా, చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ రేసులో వివేక్ కుమారుడు వంశీ ఉన్నారని సమాచారం. వివేక్ కుమారుడు వంశీకి చెన్నూరు సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రాహుల్ గాంధీతో వివేక్ మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.
