Weather Alert : ఏప్రిల్లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలలో తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని స్పష్టం చేసింది ఐఎండీ. ఇలాంటి వాతావరణం వల్ల అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలూ ఉన్నాయని.. దీంతో అటవీ శాఖనూ అప్రమత్తం చేస్తున్నామని వాతావరణ శాఖ వివరించింది.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల 41 డిగ్రీలకు మించి ఉష్ణోత్రలు నమోదయ్యాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. మరోవైపు, మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఏకంగా 122 ఏళ్ల తర్వాత దేశంలో గత నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఈ మార్చిలో సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది. ఈ ఎండల ప్రభావం ఏప్రిల్లోనూ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ తెలంగాణకు వర్ష సూచన
ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read Also : Heat Wave: ప్రాణాలు తోడేస్తున్న ఎండలు