Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి..
అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేసే పద్ధతిని మహాభారత కాలం నుండి గుర్తించవచ్చు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే3(మంగళవారం) భారతదేశం అంతటా జరుపుకుంటున్నారు...
- Harishth Thanniru
- Published On : May 3, 2022 / 09:04 AM IST
Akshaya Tritiya
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చేసే పద్ధతిని మహాభారత కాలం నుండి గుర్తించవచ్చు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే3(మంగళవారం) భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఈ పండుగ వైష్ణవ మాసంలోని శుక్ల పక్ష తృతీయ నాడు వస్తుంది. హిందూ క్యాలెండర్ అక్షయ తృతీయను సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తుంది. ఫలితంగా ఈ రోజున చాలా మంది కొత్త వ్యాపారాలు, నూతన పనులను ప్రారంభిస్తారు. అంతేకాకుండా, బంగారం, వెండి కొనుగోళ్లకు కూడా రోజు అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ప్రజలు లక్ష్మీ దేవిని పూజించి విలువైన లోహాలు, పరికరాలు, యంత్రాలను కొనుగోలు చేస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి అక్షయ తృతీయ పూజకు మంగళశారం ఉదయం 5:49 నుండి మధ్యాహ్నం 12:13 వరకు (వ్యవధి 6 గంటల 24 నిమిషాలు) మంచి మహూర్తంగా ఉందని పండితులు పేర్కొంటున్నారు.
akshaya tritiya : గోల్డ్ కొనేదెలా..
మహాభారతంలో అక్షయ తృతీయకు బంగారానికి గల సంబంధాని తెలిపేలా ఓ కథనం ఉంది.. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒకసారి వారిని సందర్శించాడు. అయితే శ్రీకృష్ణుడికి ద్రౌవపది ఫలహారం వడ్డించేందుకు సిగ్గుపడుతుంది. ఈ క్రమంలో కృష్ణుడు వంటపాత్రకు అంటుకున్న చిన్న అటుకుని ఆహారంగా స్వీకరించి, పాండవులకు తనపై ఉన్న ప్రేమ తన ఆకలి తీరుస్తుందని చెబుతాడు. అంతేకాదు పాండవులకు అక్షయపాత్రని వరంగా కృష్ణుడు ఇస్తాడు. అప్పటి నుండి పాండవులు అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు ఈ అక్షయపాత్ర అంతులేని ఆహారాన్ని అదించింది. ఆ విధంగా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల తమ కుటుంబానికి అపరిమితమైన సౌభాగ్య కలుగుతుందని హిందువులు విశ్వసిస్తారు.
Gold and silver price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంతంటే?
మరొక పురాణ కథనం ప్రకారం.. అక్షయ తృతీయ రోజున కుబేరుడు స్వర్గ సంపదకు సంరక్షకుడిగా నియమించబడ్డాడని, అందుకే ఈ రోజు బంగారంకొని కుబేరుడిని పూజించడం వల్ల తమ కుటుంబానికి ఐశ్వర్యం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. అక్షయ తృతీయ రోజున దానాలు చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ సందర్భంగా దుకాణాలు ముందుగానే ముస్తాబయ్యాయి. వివాహాలను దృష్టిలో ఉంచుకుని నయా కలెక్షన్లతో అతివలను ఆకర్షిస్తున్నాయి. అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులకు స్వాగతం పలుకుతున్నాయి. పండగ రోజున బంగారం కొనేందుకు ప్రీ బుకింగ్స్ సైతం అందిస్తుండటంతో రెండు, మూడు రోజుల ముందునుంచే బంగారం దుకాణాల్లో సందడి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్ లో బంగారంకు డిమాండ్ కూడా బాగుందని వ్యాపారులు చెబుతున్నారు.
