YS Sharmila : ధరణి తప్పుల తడకని కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ చూస్తే అర్థమవుతుంది : షర్మిల
ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అంటూ విమర్శించారు షర్మిల.
- nagamani
- Published On : November 11, 2023 / 05:19 PM IST
CM KCR..YS Sharmila
YS Sharmila on CM KCR: కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుంది అంటూ విమర్శలు సంధించారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అంటూ సెటైర్లు వేశారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్ల దాకా మార్చి చూపించే మాయాజాలమే ధరణి అంటూ విమర్శించారు.
గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలేనని.. తహశీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా ధరణి బాధలే అంటూ ఎద్దేవా చేశారు. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ.. ధరణే దైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలే అంటూ దుయ్యబట్టారు. భూ వివాదాల కోసం కాదు.. ముమ్మాటికి దొర భూ దోపిడీ కోసమే ధరణికి తెచ్చారంటూ విరుచుకుపడ్డారు.
బందిపోట్ల ఆస్తుల్ని పెంచడానికి అమలు చేసిందే ధరణి అంటూ విమర్శించారు. ధరణి తిప్పలు తప్పాల్నంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గమన్నారు. ఈ ఎన్నికల్లో కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారమన్నారు.
Also Read: ప్రధాని మోదీని పట్టుకుని భోరున విలపించిన మంద కృష్ణ మాదిగ
