Parikshit Balochi: ఒక్క కప్పు చాయ్‌ రూ.1,000.. ఇండియాలో నేను పేదవాడిలా ఫీల్ అయ్యాను.. NRI వ్లాగర్ వీడియో వైరల్

Parikshit Balochi: దుబాయ్‌లో నివసించే ప్రముఖ భారతీయ ట్రావెల్ వ్లాగర్ పరిక్షిత్ బాలోచి, ఇండియాలో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన...

A Dubai-based Indian travel vlogger Parikshit Balochi

Parikshit Balochi: భారత్‌లో పెరుగుతున్న జీవన వ్యయంపై దుబాయ్‌లో నివసించే ప్రముఖ భారతీయ ట్రావెల్ వ్లాగర్ పరిక్షిత్ బాలోచి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దిర్హామ్‌లలో సంపాదించే తాను కూడా ఇండియా పర్యటనలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అసలు ఏం జరిగింది?

పరిక్షిత్ బాలోచి (Parikshit Balochi) తన వీడియోలో.. భారత్‌లోని ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో ద్వారా అతడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ క్లిప్‌లో ఏముందో చూద్దాం..

ముంబైలోని ఒక హోటల్‌లో ఒక కప్పు టీ కోసం ఏకంగా ర.1,000 చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఉదాహరణగా చెప్పాడు. “ఒక NRIగా భారత్‌లో తిరుగుతుంటే నేను పేదవాడిలా ఫీల్‌ అవుతున్నాను.. నేను ఎప్పుడూ ఇలా జరుగుతుందని ఊహించలేదు” అని ఆయన వ్యాఖ్యానించాడు.

Also Read: రూ.3.30 కోట్లు పోసి.. బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారు కొన్న “కూలీ” నటుడు సౌబిన్ షాహిర్.. వీడియో చూశారంటే..

తలకిందులైన లెక్కలు

సాధారణంగా, విదేశాల్లో సంపాదించే ఎన్నారైలకు బలమైన కరెన్సీ మారకం రేటు వల్ల భారతదేశంలో ఖర్చులు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బాలోచి అన్నాడు.

“దిర్హామ్‌లను రూపాయలకు మార్చిన తర్వాత కూడా నాకు షాక్ తగిలింది. గతంలో ఇది దీనికి పూర్తి భిన్నంగా ఉండేది” అని ఆయన పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఒక యూఏఈ దిర్హామ్ విలువ సుమారు రూ.23.83గా ఉంది. అయినప్పటికీ, ఖర్చులు ఎక్కువగా అనిపించడం భారత్‌కు తిరిగి వస్తున్న ఎన్నారైలు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతోంది.

నెటిజన్ల స్పందన

పరిక్షిత్ బాలోచి (Parikshit Balochi) అభిప్రాయంతో సోషల్ మీడియా యూజర్లు ఏకీభవించారు. చాలామంది తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, ముంబై వంటి నగరాల్లో జీవనం ఎంత ఏ మేరకు పెరిగిందో కామెంట్ల రూపంలో తెలిపారు.

“నేను ప్రతి సంవత్సరం ముంబై వెళ్తాను. వెళ్లిన ప్రతిసారి దుబాయ్ గుర్తుకువస్తుంది. అంత ఖరీదైన జీవన వ్యయం ఉంటుంది, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది” అని ఓ యూజర్ రాశారు.

మరొకరు, “చివరికి! ఎవరో ఒకరు ఈ నిజాన్ని ధైర్యంగా బయటపెట్టారు” అని వ్యాఖ్యానించారు.

ఇంకొక యూజర్ స్పందిస్తూ.. “ప్రతిసారీ ఇండియా వెళ్లినప్పుడు ఇదే ఫీలింగ్. నేను డాలర్లలో సంపాదిస్తాను కాబట్టి పర్వాలేదు, కానీ ఇక్కడి స్థానికులు ఈ ఖర్చులను ఎలా భరిస్తున్నారు? అందరికీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ముందే తెలిసి ఉంటే నేను ఇండియాను వదిలి వెళ్లేవాడిని కాదు!” అని తెలిపాడు.