Srisaila: శ్రీశైలం వెళ్లే వాహనదారులకు గుడ్న్యూస్.. కానీ, ఈ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే..
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను ..
- Harishth Thanniru
- Published On : February 17, 2025 / 09:51 AM IST
Srisailam Temple
Srisaila Devasthanam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను తిలకించడానికి భక్తులు బారులు తీరనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈసారి ఎనిమిది నుంచి 10లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీశైలం వెళ్లాలంటే నల్లమల అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకే ఆ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి ఉండేది. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు నల్లమల అడవి మార్గంలో 24గంటల పాటు వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డివిజనల్ ఆఫీసర్ రామ్మూర్తి చెప్పారు.
అయితే, వాహనదారులకు కొన్ని షరతులు విధించారు. వాహనాలు 40 కిలోమీటర్ల స్పీడ్ మించకూడదు. హారన్ మోగించడం, ప్లాస్టిక్ వాడకంతో పాటు అడవిలో వాహనాలు ఆపడం, మద్యం సేవించడం, వంట చేసుకోవటాన్ని నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్రగా వచ్చే స్వాములకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, వటవర్లపల్లి, దోమల పెంట వద్ద తాగునీటి వసతి, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనుంది.
ఇదిలాఉంటే.. శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 19వ తేదీ నుంచి ఆత్మకూరులోని నంద్యాల మలుపు వద్ద తనిఖీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. తనిఖీ కేంద్రం వద్ద ప్రతి వాహనాన్ని పరిశీలిస్తారు. సామర్థ్యానికి మించి లోడుతో వెళ్లే చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు పర్మిట్లు రద్దు చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, జరిమానాలు విధించనున్నారు.
