Fcra Amendment Bill: స్వచ్ఛంద సంస్థల ఆటలకు చెక్.. FCRA బిల్లులో ఏముంది?
విరాళాలు దుర్వినియోగం అరికట్టేందుకు, దేశభద్రత, పారదర్శకతను కాపాడేందుకు ఎఫ్సిఆర్ఎ (Fcra Amendment Bill) సవరణ బిల్లు 2026 ఎంతో కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Fcra amendment bill 2026 foreign funding regulation and transparency
- విదేశీ నిధుల పారదర్శకత పెంపు
- మతమార్పిళ్లు, అక్రమాలపై నిషేధం
- జాతీయ భద్రతకు ప్రాధాన్యం
Fcra Amendment Bill: దేశంలో కొన్నివేల స్వచ్ఛంద సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే. వాటి వల్ల కొన్ని లక్షల మందికి సేవ చేసే అవకాశం కలుగుతోంది. అయితే, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి భారీగా విరాళాలు వాస్తు ఉంటాయి. అయితే, ఆ విరాళాలు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు, దేశభద్రత, పారదర్శకతను కాపాడేందుకు ఎఫ్సిఆర్ఎ (Fcra Amendment Bill) సవరణ బిల్లు 2026 ఎంతో కీలకమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు, బిల్లు మద్దతుదారులు భావిస్తున్నారు. 2019-2022 మధ్య దాదాపు 13,500 సంస్థలకు రూ.55,741 కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో చాలా వరకు దుర్వినియోగం అయ్యాయని సమాచారం. ఈ నిధులు అభివృద్ధి నిరోధక కార్యకలాపాలకు, ఉగ్రవాద సంబంధిత పనులకు, బలహీన వర్గాల మతమార్పిడులకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కఠినమైన చట్టపరమైన పర్యవేక్షణ అవసరమని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది దేశ ప్రభుత్వం.
పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యం:
సంస్థల నిర్వహణలో ఉన్న లోపాలను అరికట్టేందుకు ఈ బిల్లు అనేక కీలక నిబంధనలను తీసుకువచ్చింది:
*ఆస్తుల జప్తు నిబంధనలు: ఎఫ్సిఆర్ఎ రిజిస్ట్రేషన్ రద్దయినా, ముగిసినా లేదా స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నా.. విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునే అధికారం కల్పిస్తుంది.
*వ్యక్తిగత జవాబుదారీతనం: రిజిస్ట్రేషన్ ముగిసిన సంస్థలను రద్దయిన వాటితో సమానంగా పరిగణిస్తూ, నిధుల వినియోగంలో సంస్థ ముఖ్య బాధ్యులపై నేరుగా వ్యక్తిగత బాధ్యతను మోపుతుంది.
*మతపరమైన నిధుల క్రమబద్ధీకరణ: విదేశీ నిధులతో బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూనే, మతపరమైన విద్య, ఆరాధనలు, స్వదేశీ సంస్కృతి పరిరక్షణకు ఇచ్చే మినహాయింపులను అనుమతిస్తుంది.
జాతీయ ప్రయోజనాలు, భద్రతకు ప్రాధాన్యం:
గ్రీన్ పీస్ ఇండియా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లాయర్స్ కలెక్టివ్, పిఎఫ్ఐ, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వంటి సంస్థలపై గతంలో తీసుకున్న చర్యలను ఉదహరిస్తూ, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బిల్లు మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. విదేశీ ప్రమేయాన్ని, నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించే హక్కు ప్రతి సార్వభౌమ ప్రజాస్వామ్య దేశానికి ఉంటుందనే సూత్రంపై ఈ చట్టం ఆధారపడింది. భారతీయ చట్టాలకు లోబడి, దేశ ప్రయోజనాలు, సామాజిక సమగ్రతను దెబ్బతీయకుండా విదేశీ నిధులు పారదర్శకంగా వినియోగపడేలా చూసేందుకే ఈ సవరణలు దోహదపడతాయి.
