Fire Accident - Mumbai
Fire Accident – Mumbai: ముంబైలోని శాంతాక్రూజ్(Santacruz area), ప్రభాత్ నగర్లోని హోటల్ గెలాక్సీలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఓ జంట గురించి ఇవాళ వివరాలు తెలిశాయి. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న వారితో మృత్యువు దాగుడుమూతలు ఆడింది.
ఆ యువకుడి పేరు కిషన్ హలాయ్ (28), యువతి పేరు రూపాల్ (25). వారిద్దరితో పాటు రూపాల్ తల్లి, సోదరి కెన్యాకు వెళ్లాల్సి ఉంది. విమానం ఆలస్యం కావడంతో, విమానయాన సంస్థ వారికి హోటల్లోని రెండో అంతస్తులో ఓ రూమ్ లో ఉండే సౌకర్యం కల్పించింది. ఆ సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఉంటున్న గదికి మంటలు వ్యాపించాయి. కిషన్, రూపాల్ ప్రాణాలు కోల్పోయారు. రూపాల్ తల్లితో పాటు సోదరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జంట సొంత రాష్ట్రం గుజరాత్. వారి కుటుంబాలు కెన్యా రాజధాని నైరోబిలో ఉంటున్నాయి. కిషన్ సోదరుడి పెళ్లి కొన్ని రోజుల క్రితమే జరిగింది.
ఈ నేపథ్యంలోనే కిషన్, రూపాల్ కుటుంబాలు గుజరాత్ వచ్చి నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నాయి. ఇటీవలే కిషన్ కుటుంబం తిరిగి కెన్యా వెళ్లిపోయింది. కిషన్, రూపాల్ ప్రేమ జంట ఆదివారం ఎక్కాల్సిన విమానం ముందుగా నిర్ణయించిన సమయానికే వచ్చి ఉంటే వారి ప్రాణాలు నిలబడేవి. పెళ్లి ఏర్పాట్లతో వారి ఇళ్లు కళకళలాడుతుండేవి.
UPSRTC: నమాజ్ కోసం బస్సు ఆపాడంటూ సస్పెండ్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కండక్టర్