ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. పరిశ్రమలు, సేవారంగం వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందని వివరించారు. సమస్యలు అధిగమించాలంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని జగన్ కోరారు. ప్రత్యేక హోదా ఉంటేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయన్నారు.
కేంద్రం చెల్లించాల్సిన రూ.18వేల 969.26 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55వేల 548.87 కోట్లకు ఆమోదించాలన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.5వేల 73 కోట్లు విడుదల చేయాలని అమిత్ షా ని కోరారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. సోమవారం(అక్టోబర్ 21,2019) ఢిల్లీకి వెళ్లిన జగన్… మంగళవారం(అక్టోబర్ 22,2019) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో.. విభజన హామీలు, రెవెన్యూ లోటు, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.