మంత్రులకు ఆదేశాలు: బోటు ప్రమాదం ఘటనపై జగన్ సీరియస్

  • Publish Date - September 15, 2019 / 10:44 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆరా తీసిన జగన్.. వెంటనే బోటు సర్వీసులను ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న మంత్రులు వెళ్లాలని ఆదేశించారు. డ్రైవర్లకు నైపుణ్యం ఉందా? లేదా? అని చూడాలి అని చెప్పారు. అలాగే బోట్లలో అన్నీ ఏర్పాట్లు ఉన్నాయా? లేదా పరిశీలించాలని అన్నారు. సహాయ చర్యల్లో హెలికాప్టర్లను వాడాలని ఆదేశించిన జగన్.. తక్షణమే బోటు సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించారు. నిపుణులతో మర్గదర్శకాలు తయారు చేయించాలని అప్పటివరకు బోటు ఆఫీసులు మూసివేయాలని నిర్ణయించారు.

సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఘటనపై సమాచారం ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతుండగా బోటుకు అనుమతులు లేనట్లుగా అధికారులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 61మంది ఉండగా.. వారిలో 27మంది బయటపడగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తుంది.