ఎవరు అడ్డుపడినా..రాజధానిలో జనసేన పర్యటన ఆగదు

అమరావతి నుంచి మాత్రమే పరిపాలన ఉండాలని, అన్ని ప్రాంతాల్లో అభివృధ్ధి జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయని జనసేన నాయకుడు నాగబాబు తెలిపారు. బీజేపీ-జనసేన ఆశయం,ఎజెండా ఇదేనని ఆయన తెలిపారు. జనసేన ఎమ్మెల్యే వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు తెలపడంపై ప్రస్తుతం స్పందించేందుకు నాగబాబు నిరాకరించారు.

రాజధాని గ్రామాల మహిళలపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమని నాగబాబు అన్నారు. రైతులుకు సానుభూతి తెలిపేందుకు వెళ్లాలనుకున్న తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు. గాయపడిన రైతులను,మహిళలను పరామర్శించే బాధ్యత తమపై ఉందన్నారు. రైతులకు సంఘీభావం చెప్పేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని ప్రాంతంలోని ఎర్రపాలెంలో పర్యటించి తీరుతామన్నారు. తమ మద్దతును రైతులకు తెలియజేడానికి వెళ్లి తీరుతామన్నారు. రైతుల ఆందోళనలో పాలు పంచుకుంటామన్నారు. 

పవన్ కళ్యాణ్ ను ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటించకుండా జనసేన కార్యాలయం ముందు భారీగా పోలీసులు మొహరించారు. పవన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు జనసేన అధినేత. సమావేశం మధ్యలోనే పవన్ ని కలిసి రాజధాని పర్యటన విరమించుకోవాలని డీఐజీ రాణా కోరారు.

ట్రెండింగ్ వార్తలు